శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
శరత్-సుధాంశుమండలప్రభా విగర్హణాననా|
సుధామరన్దవజ్జపా సుమోవమాధరాధరా||
(ఉమా సహస్రము – 19.14)
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా
నవ-కొత్తదైన
విద్రుమ – పగడము
బింబ – దొండపండు
శ్రీ – శోభ
న్యక్కార – ధిక్కరించు/తిరస్కరించు
రదన – పన్ను/దంతము
ఛద – తెర
దంతములకు తెర అంటే పెదవులు. నూతన పగడము, దొండపండు - ఈ రెండింటి శోభను/ఎర్రదనమును వెక్కిరించు ఎర్రటిపెదవులుగల తల్లికి నమస్కారము. అమ్మ అధరములు, పగడములందలి మెరుపు/ప్రకాశమును, దొండపండుయొక్క మెత్తదనమును గలిగినవిగా భావింపవలెను. గణపతిముని తేనెతోకూడిన ఎర్రని మంకెనపూవులతో (జపాకుసుమములు) సాటియైన అధరములుగల తల్లిగా వర్ణించారు.
అధరమంటే క్రింది పెదవి, ఓష్ఠమంటే పై పెదవి అయిననూ, పెదవులు రెండింటినీ కలిపి అధరములని వాడుకలో గలదు.
ఆగమములందు, సృష్టియందలి ఎర్రదనమంతా అమ్మ అరుణవర్ణమునుండే వచ్చినదని చెప్పడుతున్నది. అలాంటప్పుడు, నీయొక్క అధరోష్ఠముల వర్ణమును పగడము, దొండపండుల వర్ణముతో ఎట్లు పోల్చగలనని ప్రకృత్యారక్తాయా స్తవ సుదతి! దంతచ్ఛదరుచేః (సౌన్దర్యలహరి-62) శ్లోకమునందు ఆదిశంకరులు ప్రశ్నించారు.
దుర్వాసముని తాంబూలసేవనము వలన ఎర్రబడిన తల్లి పల్లవాధరములను శృంగారాది రసాలయమ్..తాంబూలారుణపల్లవాధరయుతమ్.. జనని ధ్యాయామితే మంగళమ్ (త్రిపురా మహిమ్నస్తోత్రము-36) శ్లోకమునందు వర్ణించారు. ఈ అమ్మ సేవించుచున్న తాంబులముగురించిన వర్ణన పైనామములలో చూద్దాము.
రాగముతోకూడిన పెదవులుగలిగిన తల్లి మనలోని రాగమును సంపూర్ణముగా తొలగించవలెనని ప్రార్ధిస్తూ
శ్రీమాత్రేనమః
No comments:
Post a Comment