Wednesday 26 September 2018

sinjAna-maNi-manjIra-maNDita-srI-padAmbujA శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

శరణమ్ కరవాణ్యమ్బ చరణమ్ తవ సుందరి|
శపే త్వత్పాదుకాభ్యామ్ మే నాన్యః పన్థా అయనాయ||
 (త్రిపురసుందరీవేదపాదస్తవము)

శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా
శింజాన-మణి – ధ్వనించు మణులతోకూడిన
మఞ్జీరమంజు మనోహరమ్ ఈరయతి ధ్వనతీతి మఞ్జీరః – మనోహరముగా మ్రోగునది
మండిత – అలంకరించబడిన
శ్రీపదాంబుజ – శోభాయమానపాదపద్మములు
ధ్వనులుచేయు మణులతోకూడిన మువ్వలతో మనోహరముగా మ్రోగుచున్న మంజీరములతో శోభిల్లు పాదకమలములు గలిగిన తల్లికి నమస్కారము.

పరమాత్మయొక్క నామరూపాత్మకమైన సృష్టియందలి రూపవిస్తారమును క్రిందటి నామము తెలుపుచుండగా, ఈ నామము ఆ సృష్టియందలి నామ(శబ్ద/ధ్వని)విస్తారమును తెలుపునదిగనున్నది. తల్లి కాలిగోళ్ళయందు వ్యక్తీకరింపబడిన అనంతసృష్టిప్రభలు పరమ్బ్రహ్మయొక్క తేజస్సునందలి నాల్గవభాగమని చెప్పుకున్నాము. తత్సంబంధిత వాక్కు/నాదము/శబ్దము కూడా అదేవిధముగా జెప్పబడుచున్నది.
తత్రైకగుణమాకాశమ్ శబ్ద ఇత్యేవ తత్స్మృతమ్|
తస్య శబ్దస్య వక్ష్యామి విస్తరమ్ వివిధాత్మకమ్|| 
(నారద పురాణము 42.89,90)
వ్యోమముయొక్క ఏకైక గుణమైన శబ్దము పలువిధములుగ విస్తరించబడినది.

బ్రహ్మాయమ్ వాచః పరమమ్ వ్యోమః (ఋగ్వేదము 1.164.3)
ఋతస్య ప్రథమజ వాచః (ఋగ్వేదము 1.164.37)
(ఋతము) పరంబ్రహ్మ తేజస్సునుండి వ్యోమము(ఆకాశము)నందు ప్రథమముగా శబ్దము ఉద్భవించినది.

క్రిందటినామమునందు పరంబ్రహ్మనుండి ప్రథమముగా జలము ఏర్పడినట్లు చెప్పుకున్నాము. ఈ జలములే శబ్దజనకములు (సలిల సమృద్ధే ఘోషవాన్ – నారదపురాణము అ42-శ్లో51-52).

సృష్టిచేయుటయనునది క్రియాశక్తి సూచితము. ఏదైనా క్రియ జరిగినప్పుడు, శబ్దముజనించుట విదితమే. అయితే పరమేశ్వరుని సృష్టికారణముగ ఏర్పడిన శబ్దము, అశ్రవణము.

అనాహతో హతశ్చైవ స నాదో ద్వివిధో మతః|
ఆకాశసంభవో నాదో యః సోనాహతసంజ్ఞితః|| 

(సంగీత మకరందము – 1.4)
అనాహత (అశ్రవణములు), ఆహత(శ్రవణములు)  యని నాదము రెండు విధములు. అనాహత శబ్దమనిన రాపిడిలేకుండగ ఏర్పడిన, శ్రవణేంద్రియములు గ్రహించలేనిది, రహస్యమైన శబ్దమనియు అర్ధములు. వ్యోమమునందు ఏర్పడిననాదము అనాహత సూచితము.

వేదశబ్దేభ్య ఏవ-అదౌ పృథక్ సంస్థాశ్చ నిర్మమే |
  (మనుస్మృతి – 1.21)
వేదత్రయాత్ సముధృత్య ప్రణవమ్ నిర్మమే పురా| 
(గాంధర్వ తంత్రము – 18.57)
వేదశబ్దములు అనాహతము, మూడువేదములందలి ప్రణవము అనాహతము.

చత్వారి వాక్ పరిమితా పదాని తాని విదుర్ బ్రాహ్మణా యే మనీషినః
గుహా త్రీని నిహితా నేన్గయన్తి తురీయమ్ వాచో మనుష్యా వదంతి|| 
 (ఋగ్వేదము1.164.45)
ప్రజ్ఞానఘనీభూతమైన పరమాత్మనుండి వెలువడిన దివియందలి వాక్కు/శబ్దము నాలుగు దశలుగ పరిణామము చెందుతుంది - పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. వీనియందు మొదటి మూడు పరా, పశ్యంతి, మధ్యమ, గుహ్యములు. మహాతపస్వులైన దృష్టలు, ఋషులుమాత్రమే గుహ్యమైన స్వర్లోకపు వాక్కును దర్శించగలరు.  వ్యక్తీకరింపబడిన సృష్టియందలి శబ్దములన్నియూ దివియందలి వాక్కుయొక్క నాల్గవభాగము మాత్రమే.

వ్యక్తీకరింపబడిన నాల్గవ భాగమైన వైఖరి దివిశబ్దములు, అనంతకోటిబ్రహ్మాండ సృష్టియందు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరియని మరల నాలుగు భాగములుగా విభజించబడినవి. వీనియందలి మూడుభాగములు పర,పశ్యంతి,మధ్యమ గుహ్యముగానుండును. మనుష్యులు మాట్లాడుచున్న వైఖరివాక్కు నాల్గవభాగము.

శబ్దబ్రహ్మమయమ్ యత్తన్మహావాక్యాదికమ్ ద్విజ |
తద్విచారోద్భవమ్ జ్ఞానమ్ పరమ్ మోక్షస్య సాధనమ్ ||
 (నారద పురాణము – 33.65)
వేదవేదాంగములందలి తత్త్వమసి, అహమ్ బ్రహ్మోస్మి వంటి మహావాక్యములు (శ్రీపదములు) శబ్దబ్రహ్మమయములు మరియు మానవులకు మోక్షసాధనములు.

తల్లిపాదపద్మములందలి మువ్వలధ్వనులు శబ్దబ్రహ్మాత్మకమైన  మహావాక్య సూచితములు. వీనినే వాగ్దేవతలు శ్రీపదములని సూచించినారు.

పాదములందలి అనంతచైతన్యశక్తియొక్క శబ్దరూపమునే అజాతశత్రువు నడుచునప్పుడు వెలువడు శబ్దరూప ముఖ్యప్రాణశక్తియని బృహదారణ్యకోపనిషత్తునందు వ్యవహరించారు.

స య ఏతమేవముపాస్తే సర్వం హైవాస్మల్లోక ఆయురేతి నైనమ్ పురా కలాత్ప్రాణో జహాతి|
(బృహదారణ్యకోపనిషత్తు – 2.1.10)
గార్గి, అజాతశత్రువుల సంవాదమునందలి ఈ మంత్రము, చలనమువలన ఏర్పడు శబ్దమును ముఖ్యప్రాణమని (vital force/Sabda Brahma) చెప్పుచున్నది. ఇక్కడ, నడుస్తున్నప్పుడు జనించు శబ్దమును చర్చిస్తున్నారు.

సహస్రనామములందలి మూడునామములు మాత్రమే రత్న కలిగియున్నవని ఇదివరలో చెప్పుకున్నాము. (రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా – కటిసీమ: మూలాధారము/నాభి) పరా, పశ్యంతి, (కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ - హృదయము) మధ్యమ, (రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా-గ్రీవము/కంఠము) వైఖరీ వాక్కు సంబంధిత స్థానములు రత్నయను పదమునుగలిగియున్నవి. 

శబ్దరూప పరమచైతన్యము పరావాక్కు.
బిందోస్తస్మాద్ భిద్యమానాద్ రవోవ్యక్తాత్మకో భవేత్|
స రవః శృతిసంపన్నైః శబ్దబ్రహ్మేతి కథ్యతే| 
 (ప్రపంచసారతంత్రము1.44)
చైతన్యం సర్వభూతానామ్ శబ్దబ్రహ్మేతిమేమతిః|
తత్ప్రాప్య కుండలీరూపమ్ ప్రాణినా దేహమధ్యగమ్|| 
 (శారదాతిలకతంత్రము-శబ్దబ్రహ్మోత్పత్తి)
ప్రజ్ఞానచైతన్యఘనీభూతమైన పరమాత్మ, సర్వప్రాణులదేహములందలి మూలాధారమునందు శబ్దబ్రహ్మరూపముగనుండి వాయుప్రోద్బలముచే ఊర్ధ్వదిశగా ప్రయాణించి వైఖరీవాక్కుగ వెలువడుచున్నది.

రత్నకింకిణుల కటిసూత్రముతో అలంకరించబడిన మూలాధారమునుగలిగిన కటిసీమ, శబ్దబ్రహ్మమైన పరావాక్స్థానము.

తల్లి ఆభరణములన్నియు చైతన్యవంతములే అయిననూ, సగుణరూపవర్ణనయందు రెండు నామములందు మాత్రమే మ్రోగుచున్న మువ్వలను చెప్పబడినవి. శబ్దబ్రహ్మ స్థానములైన (పరావాక్స్థానము-మూలాధారము) కటిసీమను, పాదపద్మములను అలంకరించిన ఆభరణములు (రత్నకింకిణిలుగలిగిన వడ్డాణము/కటిసూత్రము, శింజానమణులు గలిగిన మంజీరములు) మాత్రమే చిరుసవ్వడిజేయునవని వాగ్దేవతలు వర్ణించారు.

తల్లి మంజీరరవములు మానవులకు మోక్షసాధనములైన మహావాక్యములనునది అంతరార్ధము.

తల్లియొక్క మనోహరమైన అనాహత మంజీరనాదములో సదాసర్వదా లీనమగు భాగ్యము కలగవలెనని ప్రార్ధిస్తూ

శ్రీమాత్రేనమః

Sunday 16 September 2018

pada-dvaya-prabhAjAla-parAkruta-sarOruhA పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
దధానో భాస్వత్తామమృతనిలయో లోహితవపు-
ర్వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్|
గతౌ మన్దో గఙ్గాధరమహిషి! కామాక్షి! భజతాం
తమః కేతుర్మాతస్తవ చరణపద్మో విజయతే|| 
(మూకపంచశతి-పాదారవింద శతకము – 59)
తల్లీ!! గంగాధరునిపట్టమహిషీ!! కామాక్షీ!! నీ చరణపద్మములు ప్రకాశమును వెదజల్లుటచే సూర్య తత్త్వమును, భక్తులకు మోక్షామృతత్వమును ప్రసాదించునవగుటచే చంద్రతత్త్వమును, లోహితవర్ణపువగుటచే అంగారక తత్త్వమును, సౌమ్యత్వముచే బుధగ్రహ తత్త్వమును, భక్తులకు జ్ఞానమును ప్రసాదించునవగుటచే గురుగ్రహ తత్త్వమును, కవితాచాతుర్యమును అనుగ్రహించునవగుటచే (కవి)శుక్రగ్రహ తత్త్వమును, మందగమనయగుటచే శనిగ్రహ తత్త్వమును సూచించుచుండగా, భక్తుల అజ్ఞానాంధకారములకు(తమస్సు) శత్రువు(కేతు)లగుటచే రాహుకేతువులను సూచిస్తున్నాయి. ఈ విధముగా నీ పాదపంకజములు భక్తులకు ఐహికసుఖములను ప్రసాదించు నవగ్రహములరూపమున విరాజిల్లుతున్నాయి.

పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా
పదద్వయ – పాదములజంట
ప్రభాజాల – వెలుగులు
    పరాకృత – ఓడించు 
    సరోరుహా - సరస్యామ్ రోహతీతి సరసీరుహమ్, రుహ బీజ జన్మని ప్రాదుర్భావేచ - సరస్సునందు పుట్టినది; -      కమలములు/తామరలు
ద్వయకలిగిన ఈ నామము పాదములకాంతులను వర్ణించునది. పద్మములకాంతులను మించినకాంతులతో కూడిన పాదములజంట గలిగిన తల్లికి నమస్కారము.

పద్యతే గమ్యతే అనేనేతి పాదః వీనిచే అడుగులు వేసి, గమనముజేయుటచే  పాదములనిచెప్పబడుచున్నవి. అందుచే పాదములందలి ద్వయశబ్దము శక్తికూటమునందలి క్రియాశక్తి సంబంధితము, ఉమామహేశ్వరుల సూచితము.

వాగ్దేవతలు తల్లి పాదములకాంతులు పద్మముల కాంతులను ఓడిస్తున్నాయని మాత్రమేజెప్పారు. ఆదిశంకరులు సౌన్దర్యలహరియందలి 87వశ్లోకము హిమానీహంతవ్యమ్ హిమగిరినివాసైక చతురౌనందు, పద్మములకన్నా ఏఏ విషయములందు తల్లి పాదములు ఉత్తమముగా ఉన్నాయో పట్టీవేసి చూపించారు. పద్మములు మంచుప్రాంతములందు వాడిపోతాయి కానీ మంచుకొండను పుట్టినిల్లు, మెట్టినిల్లుగా గలిగిన తల్లియొక్క పాదములు సహజవికసన గుణమును కలిగియున్నాయి. పద్మములు సూర్యకాంతికి వికసించి, చంద్రుని రాకతో ముకుళించుకుపోతాయి. కానీ భక్తులపట్ల కరుణాపూరితయైన తల్లిపాదాంబుజములు వారిని అనుగ్రహించుటకొరకు సర్వకాల సర్వావస్థలయందు వికసించి ఉంటాయి. మూడవదిగా, పద్మములు, ఐశ్వర్యదేవతయైన లక్ష్మీదేవికి నిలయముకాగా, తల్లిపాదాబ్జములు శరణువేడిన భక్తులకు ఐశ్వర్యమును ప్రసాదిస్తున్నాయి. అమ్మా!! ఈ విధముగా నీ పాదాంబుయములు, సరోరుహములకన్న మిన్నయని శంకరభగవత్పాదులవారు, సరోరుహములను పరిహసించు పాదపద్మములను స్తుతించారు.

గోళ్ళకాంతులు, పాదములవి కాదా? మరి దీనికి విడిగా వేరొకనామము జెప్పుటయందలి అంతర్యము?? పాదములప్రకాశము దేనిని సూచిస్తున్నది?
అంతరార్ధము:
కాలిగోళ్ళ కాంతులను వర్ణించిన వెంటనే, ఆ కాలిగోళ్ళనుకలిగిన పాదముల తేజస్సును వర్ణిస్తున్నారు వాగ్దేవతలు, ఈ నామమునందు. మ్రొక్కినవారి తమోగుణమును కాలిగోళ్ళ కాంతులు పోగొడుతున్నాయని చెప్పి, ఆ గోళ్ళనుకలిగిన పాదములకాంతులు పద్మములకాంతులను జయిస్తున్నాయని పొగుడుతున్నారు. తల్లి పాదములను వాగ్దేవతలు తామరలతో పోల్చి  (పాదాబ్జము, పదామ్బుజము) ఇదే స్తోత్రమునందు స్తుతించారు. కానీ, ఈ నామమునందు పాదములవెలుగులను మాత్రమే చెప్పారుగాని, పాదములను పద్మములని నేరుగా వర్ణింపలేదు.

దీనిరహస్యమును తెలుసుకొనుటకు పోల్చబడిన పదద్వయములను, సరోరుహమును చూద్దాము.

బహిర్గతమైన సృష్టిరహస్యము నాసదీయసూక్తమునందలి క్రింది మంత్రము ద్వారా తెలుసుకున్నాము.
ఆసీత్తమసాగూఢమ్ అగ్రే ప్రకేతమ్ సలిలమ్ సర్వమా ఇదమ్|
(నాసదీయ సూక్తము 10.129.03)
ఇంకనూ,
తామిద్ గర్భమ్ ప్రథమమ్ దధ్ర ఆపో యత్ర దేవా స్సమగచ్ఛంత విశ్వే
  (ఋగ్వేదము 10.82.6)
ఆప ఏవదమగ్ర ఆసుః (బృహదారణ్యకోపనిషత్తు 5.5.1)
అప ఏవ ససర్జాऽऽదౌ తాసు వీర్యమవాసృజత్  
 (మత్స్యపురాణము 2.28,మనుస్మృతి 1.08)
యదమోఘ మపామన్తరుప్తమ్  బీజమజత్వయా
అతశ్చరాచరం విశ్వమ్ ప్రభవస్తస్య  గీయసే  
(కుమారసంభవము – ద్వితీయసర్గ -5)
వీటన్నిటియందు చెప్పబడినది, సృష్టికి పూర్వమునున్న సలిలమ్, అప అంటే నీరు. సృష్టిచేయ సంకల్పించిన పరమేశ్వరుడు జలములను (primordial cosmic waters) ముందు సృష్టించి తనబీజమునందుంచెనని యర్ధము. ఈ చరాచర విశ్వమంతయు సరస్సుయందలి సృష్టిబీజమునుండి వెలువడినదే. ఈ నామమునందలి సరోరుహ అంటే సరస్సునుంచి ఉద్భవించిన బ్రహ్మాండ జగత్తు.

సరోరుహకాంతులను తల్లియొక్క పదద్వయ ప్రభలు ఓడించుచున్నవనిన, బహిర్గతసృష్టి ప్రకాశములకు అధికరెట్లు పదద్వయ తేజస్సుగలదని అర్ధము.

స్థావరజంగమసృష్టికి మూలము సృష్టిస్థితిలయకారకమైన శివశక్త్యాత్మకమైన బ్రహ్మవస్తువు. ఈ పరంబ్రహ్మమునే పురుషుడుయని నిగమాగమములందు జెప్పబడినది.

పురాణ్యనేన సృష్టాని నృతిర్యగృషిదేవతాః | శేతే జీవేన రూపేణ పురేషు పురుషో హ్యసౌ|
 (శ్రీమద్భాగవతము 7.14.37)
సర్వ సృష్టి, స్థితి, లయ కారణకర్తయైన పరమేశ్వరుడు ఆబ్రహ్మస్తంబశిల్పకల్పనజేసి, వానియందు స్వయముగ అంతర్యామిరూపముగ (పురిశయనాయాత్పురుషః) ప్రకాశించుచుండుటచే  పురుషుడని ప్రసిద్ధి.

ఏతావానస్య మహిమాతో జ్యాయాన్-చ పూరుషః| 
(ఋగ్వేదము – పురుషసూక్తము -10.90.03)
పురుషునియొక్క బృహత్(జ్యాయాన్) మహిమచే (మహిమా స్వకీయ సామర్ధ్య విశేషః – శాయనభాష్యము) సమస్త సృష్టి కలిగినది.
సత్యమ్ జ్ఞానమ్ అనంతమ్ బ్రహ్మ 
(తైత్తిరీయ ఉపనిషత్తు – 2.1.1).
హన్త తే కథయిష్యామి దివ్యాః ఆత్మవిభూతయః|
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్తి అన్తః విస్తరస్య మే|| 
 (భగవద్గీత 10.19)
అనంతమైన బ్రహ్మయొక్క విభూతి విస్తారము అనంతమైనది.
పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతమ్ దివి|  
(ఋగ్వేదము – పురుషసూక్తము -10.90.03)
అయితే, అనంత విస్తారముగలిగిన విశ్వభూత రచనకు (సృష్టికి) ఒక పాదము (అత్యల్పమైన ఒకానొక అంశము) మాత్రమే ఉపయోగించబడినది.  తక్కిన మూడుపాదములు అమృతమయమైన ప్రకాశరూపము (దివి). వైదీక పరిభాషయందు పాదమనిన నాలుగులో ఒకటోవంతు. సంఖ్యాపరముగా, ఈనామమునందలి పద రెండు సంఖ్యకు సూచనగా తీసుకుంటే, పదద్వయ రెండుకు రెండురెట్లు అంటే నాలుగు, పూర్ణత్వమునకు సూచితము. పూర్ణమదః పూర్ణమిదమ్ అని చెప్పబడుచున్న సత్-చిత్-ఆనంద ప్రభలనుండి నాలుగోవంతు తేజస్సుతో రచించబడినదీ అనంతబ్రహ్మాండకోటి స్థావరజంగమ సృష్టి.

దీనినే భగవద్గీత 10.42వశ్లోకమునందు విష్టభ్యాహమిదమ్ కృత్స్నమ్ ఏకాంశేన స్థితో జగత్ అనంతకోటి బ్రహ్మాండములన్నియు తనయొక్క ఒకానొక అంశతో మాత్రమే వ్యాపింపబడియున్నవని కృష్ణపరమాత్మ అర్జునితో చెప్పినాడు.

సృష్టికిపూర్వము ఏకముగానున్న శివశక్త్యాత్మకమైన పరమేశ్వర చైతన్యమునందలి కించిత్తు భాగముమాత్రమే బహిర్గతమై, అభివ్యక్తమైన సృష్టి. అనగా, సమస్త కోట్ల బ్రహ్మాండసృష్టి, పరంబ్రహ్మ యొక్క ఒకానొక లవలేశాంశతో మాత్రమే ఏర్పడినది.

ఈ విధముగా, పదద్వయప్రభలు సరోరుహమును ఓడించుచున్నవియనగా, పరమేశ్వరుని తేజస్సుతో పోల్చినప్పుడు, బహిర్గత సృష్టి (సరోరుహ) ప్రకాశము ఈషణ్మాత్రమని అంతరార్ధమువలెనున్నది.

తల్లిపాదములప్రభల దర్శనభాగ్యము అతిశీఘ్రము కలగవలెనని ప్రార్ధిస్తూ,
శ్రీమాత్రేనమః

Sunday 9 September 2018

nakha-dIdhiti-sanchanna-namajjana-tamOguNA నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః

ఆశౌశవాత్-మమతయా కలితః త్వయా-అసౌ
ఆనృణ్యమ్- అమ్బ తవ లబ్ధుమనాః మృగాంకః|
స్వాత్మానమేవ నియతమ్ బహుధా విభజ్య
త్వత్పాదయోః వినిదధే నఖరాపదేశాత్|| 
(నీలకంఠదీక్షితుల ఆనందసాగర స్తవము – 64)
అంబా!! నెలవంక శిరస్సుమీద ధరించుటద్వారా చిరువయసునుండి నీమమతకు పాత్రుడగుటచే, నీపట్లతనకుగల భక్తినిచూపించుటకొరకుగాను, చంద్రుడు స్వయముగ తనను పదిఖండములుగ విభజించుకొని, నీ కాలిగోళ్ళరూపమును ధరించినట్లున్నది.

నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా
నఖము -  గోరు
దీధితిప్రకాశము
సంఛన్నఆవరించిన
నమత్-జన - నమస్కరించిన జనులకు
తమోగుణ తమోగుణము
నమస్కరించిన జనుల తమోగుణమును సంపూర్ణముగా ఆవరించగల ప్రకాశముతోకూడిన కాలిగోళ్ళనుగలిగిన తల్లికి నమస్కారము. రాత్రినుండి ఆవరించిన అంధకారము, తరుణారుణకాంతుల ప్రకాశముతో తొలగినట్లుగా, తలవంచి తల్లి పాదములకు నమస్కరించిన భక్తుల హృదయాంధకారము, తల్లికాలిగోళ్ళ వెన్నెలవెలుగులతో సమూలముగా నశించునని వాగ్దేవతలు భక్తుల తమోగుణనిర్మూలనకు తరుణోపాయము చెప్పుచున్నారు.

అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ |
తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన || (భగవద్గీత 14.13)
త్రిగుణములలో ఒకటైన తమోగుణముయనిన అప్రకాశము(అజ్ఞానము, అవివేకము, భయము), అప్రవృత్తి (జడత్వము, సోమరితనము), ప్రమాదము (అజాగ్రత్త), మోహము మొదలగునవి. వీనియందు కృష్ణపరమాత్మ అప్రకాశమును ముందుచెప్పుటచే అది ఎంతముఖ్యమైనదో తెలుసుకొనగలరు. సదసత్-జ్ఞానము లేకపోవడమే అజ్ఞానము. నిజానికి, ఈ ఒక్కదానివలన మిగిలినవి కలుగుచున్నవి.

! చండీ!! (స్వర్గలోకపు) నాకస్త్రీలు నీ పాదములకు ప్రణమిల్లుటకు రెండుచేతులను దగ్గరజేర్చినపుడు వారి కరకమలములు, నీ పాదములందలి కాలిగోళ్ళ తెల్లని చంద్రకాంతులకు ముకుళించుకుపోవు కమలములవలెనున్నవి. అంతేకాదు, స్వర్గలోకమునందలి కల్పవృక్షములు తమచేతులను చిగురుటాకులతో స్వర్గవాసుల కోరికలు మాత్రమే తీరుస్తాయి. కానీ, పాదములను శరణువేడినచో దేవతాస్త్రీలతో పాటు దరిద్రులకు, సామాన్యమానవులకు కూడా కోరినసంపదలను నిరంతరము ఇచ్చు తల్లిపాదములు కల్పవృక్షములకన్న మిన్నయని, తల్లిపాదములు కల్పవృక్షములను పరిహసిస్తున్నట్లు 89వశ్లోకము నఖైర్నాకస్త్రీణామ్ కరకమల సంకోచశశిభిః యని శంకరభగవత్పాదులవారు సౌన్దర్యలహరియందు చంద్రకాంతులను వెదజల్లు తల్లికాలిగోళ్ళను వర్ణించారు.

అంతరార్ధము:
తమ ఆసీత్తమసాగూఢమ్ అగ్రే ప్రకేతమ్ సలిలమ్ సర్వమా ఇదమ్|
(నాసదీయ సూక్తము 10.129.03)
నాసీదహో న రాత్రిరాసీన్న సదాసీన్నాసదాసీత్ తమ ఏవ పురస్తాదభవద్ విశ్వరూపమ్|
సా విశ్వరూపస్య రజనీ హి ఏవమస్యార్థోనుభాష్యః||
(మహాభారతము శాంతిపర్వము - 342-8శ్లో)
తమో వా ఇదమగ్ర ఆసీదేకమ్ (మైత్రాయణ్యుపనిషత్తు 5.2)
సృష్టికి పూర్వముగల అహము(పగలు), రాత్రి, సత్తు, అసత్తుకాని విశిష్టమైన ప్రజ్ఞావంత విశ్వరూప విశ్వచైతన్యమే తమస్సు. ఈ తమస్సును విశ్వాత్మయొక్క (రజని)రాత్రిగా  జెప్పబడుచున్నది. (సోఽకామయత బహుస్యామ్ ప్రజాయేయేతి - తైత్తిరీయ ఉపనిషత్తు) ఒక్కటిగానున్న ప్రజ్ఞానఘనమైన బ్రహ్మవస్తువు  బహురూపములు పొందు సృష్టికార్యము, విశ్వాత్మయొక్క పగలు. అట్టి సృష్టికారణముచే, సూర్యకిరణముల వెలుగుతో మరుగగుచున్న చీకటివలె, తమస్సు అంతమగుచున్నది. దీనినే దీర్ఘతమస్సను ఋషి, ఋగ్వేదమునందు (1.158) నిగూఢముగ వ్యక్తపరచినారు.

సృష్టికి తఱువాయి అదృశ్యమగుచున్న ఆదితమస్సునే ఈ నామమునందు తమోగుణమని వ్యవహరించుచున్నారు. మరి తల్లి కాలిగోళ్ళకు, తమోగుణమునకు సంబంధమును తెలుసుకొనవలెననిన శ్రీమద్దేవీభాగవతమునందు బ్రహ్మదేవుడు చెప్పిన క్రిందిశ్లోకములను పరిశీలించవలెను.

నఖదర్పణ మధ్యే వై దేవ్యాశ్చరణపంకజే|
బ్రహ్మాండమఖిలమ్ సర్వే తత్ర స్థావరజంగమమ్
(శ్రీమద్దేవీభాగవతము 3స్క-4-20-30శ్లో)
తల్లియొక్క చరణపంకజములందలి దర్పణములవంటి గోళ్ళయందు అఖిల బ్రహ్మాండమునందలి సమస్త స్థావరజంగమసృష్టిని (బ్రహ్మ, విష్ణు, రుద్ర, వాయు, అగ్ని, యమ, సూర్యచంద్రులు, వరుణ, త్వస్థ, ఇంద్ర, కుబేరాది దేవతలు, అప్సరసలు, గంధర్వులు, నదులు, సముద్రములు, పర్వతములు, విశ్వావసు మొదలైన వారు, నారదతుంబురులు, హాహా, హూహూ మొదలైన గంధర్వులు, అశ్వినులు, అష్టవసువులు, సాధ్యా, సిద్ధులు, పితృదేవతలు, అనంత మొదలైన నాగములు, కిన్నెరలు, రాక్షసులు, బ్రహ్మలోకము, వైకుంఠము, కైలాసము) చూసితిమని బ్రహ్మదేవుడు చెప్పినట్లు వ్యాసదేవులు దేవీభాగవతమునందు వర్ణించారు.

తల్లియొక్క కాలిగోళ్ళయందు తెలియబడుచున్న బ్రహ్మాండపు కాంతివెలుగులతో తమస్సు తొలగించబడినట్లు చెప్పునది ఈ నామము.

(ఏకమేవాద్వితీయమ్-బ్రహ్మ) అజరము, అమృతము, అభయము, అశోకము, అనంతముయైన సృష్టి, స్థితి, లయకారక బ్రహ్మవస్తువుతో ప్రారంభించిన తల్లిసగుణరూపవర్ణన సకలసృష్టినిగలిగిన పాదములతో పూర్తియగుచున్నది. తల్లియొక్క కేశాదిపాదాంత సగుణరూపవర్ణనయందు సత్-చిత్-ఆనందభూతమైన విశ్వచైతన్యాత్మక పరమాత్మనుండి సమస్త బ్రహ్మాండాంతర్గత స్థావరజంగమ సృష్టిక్రమము రహస్యముగనుంచి స్తోత్రరచన జేసినారు వాగ్దేవతలు.

భైరవయామల తంత్రమునందు మహాదేవుడు స్వయముగా ఈ క్రింది స్తోత్రమునందు, పిండాండ, బ్రహ్మాండముల సృష్టి, స్థితి, సంహారక్రమములను తెలియజేయునదే శ్రీచక్రమనియు, తల్లి శ్రీచక్రరూపిణియనియు చెప్పినాడు.

కలావిద్యాపరాశక్తిః శ్రీచక్రాకారరూపిణీ|
తన్మధ్యే బైందవమ్ స్థానమ్ తత్రాస్తే పరమేశ్వరీ||
సదాశివేనసంయుక్తా సర్వతత్త్వాతిగామినీ|
చక్రమ్ త్రిపురసుందర్యా బ్రహ్మాండాకారమీశ్వరీ||
పంచభూతాత్మకమ్ చైవ తన్మాత్రాత్మకమేవచ|
ఇంద్రియాత్మకమేవచ మనస్తతత్త్వాత్మకమ్ తథా||
మాయాదితత్త్వరూపమ్ చ తత్త్వాతీతమ్ తు బైందవమ్|
బైందవే జగదుత్పత్తి స్థితి సంహారకారిణీ||
ఇందుమూలము, సగుణరూపవర్ణననామములందు వాగ్దేవతలు గుప్తముగా శ్రీచక్రావిష్కరణగావించినట్లున్నది.

తల్లియొక్క కాలిగోళ్ళ వెన్నెలవెలుగులు నాయందలి అంతఃతిమిరమును సమూలముగా నాశనముజేయవలెనని ప్రార్థిస్తూ
శ్రీమాత్రేనమః