శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
అరుణాం కరుణాతరంగితాక్షీం
ధృతపాశాంకుశపుష్పబాణచాపామ్
అణిమాదిభిరావృతాం మయూఖైః
అహమిత్యేవ విభావయే భవానీమ్
పాశము, అంకుశము, చెఱకువిల్లు మరియు పువ్వులబాణములను ధరించి భక్తులపై కరుణాతరంగములను ప్రసరించు నేత్రములతో అరుణవర్ణ తేజస్సుగలిగిన లలితామహాత్రిపురసుందరీ ధ్యానశ్లోకముయొక్క సూక్ష్మార్ధమును గమనించిన అష్టమూర్తితత్త్వము (భూమిరాపో అనలోవాయుః ఖం మనోబుద్ధిరేవ చ అహంకారము) ప్రస్ఫుటముగా తెలియవచ్చును.
పాశము: బంధించునది పాశము. బంధన స్పర్శకు కారణమగునుగాన, పాశము స్పర్శతన్మాత్ర సంబంధిత వాయుతత్త్వమునకు
అంకుశము: గజరాజును నియంత్రించు అంకుశము, భూతత్త్వమునకు
చాపము: రసభరితమైన చెఱకుతో జేయబడినవిల్లు, రసతన్మాత్ర సంబంధిత జలతత్త్వమునకు
పుష్పబాణము: పువ్వులబాణములు శబ్దతన్మాత్ర సంబంధిత ఆకాశతత్త్వమునకు
అణిమాదిభిరావృతామ్ మయూఖైః: అరుణవర్ణ తేజస్సుతో(మయూఖములు) కూడిన తల్లి రూపము, రూపతన్మాత్ర సంబంధిత అగ్నితత్త్వమునకు అనుబంధముగలిగి చతుర్భుజములందలి ఆయుధములతోకూడిన తల్లిరూపము పంచభూతములను సూచించుచున్నది.
ఇకపైన మిగిలిన మనస్సు, బుద్ధి మరియు అహంకారము ఎలా అన్వయించాలో చూద్దాము.
వాగ్దేవతలు తల్లిని మీనాక్షిగా వర్ణించిననూ, శ్రుతులయందు తల్లి నయనములు, తాటంకములు, స్తనములు, ఈ మూడునూ సూర్యచంద్రులతో సంకేతింపబడినవి.
సూర్యచంద్రౌస్తనౌ దేవ్యాః తావేవనయనే స్మృతా
ఉభేతాటంకయుగళమ్ ఇత్యేషా వైదికీ శ్రుతిః||
కరుణాతరంగితాక్షి: భక్తులపైన కరుణాతరంగములను ప్రసరించు సూర్యచంద్రులను తల్లి నేత్రములు బుద్ధి, మనస్సులకు సంకేతము.
అహమ్: అహమిత్యేవభవానీమ్ యందలి అహమ్ పుమాన్/యజమాని/పురుషుని కి సంకేతము.
సృష్టియందలి అష్టప్రకృతులుగా విరాజిల్లు భవానిని ప్రార్ధించునదీ ధ్యానశ్లోకము.
ఇకమీదటవచ్చు 126 (10+10+56+8+11+1+25+2+3) నామములు సాధకుల శరీరమునందలి తొమ్మిదిచక్రములందు ఉత్తేజితమగు అసురీశక్తులను దునుమాడు శౌర్యశక్తులైన నవదుర్గల (శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి) సంబంధితమైనవి. వేదములు, పురాణములందు దుష్టదానవులను చీల్చిచెండాడు దుర్గతినాశనియైన యోద్ధాశక్తి దుర్గాదేవి వర్ణించబడినది. శైవాగమములందలి నవదుర్గా స్తోత్రముననుసరించి ఒక్కొక్కశక్తి ఒకొక్క చక్రసంబంధితము.
అయితే ఈ 126నామములందు పరమశివుని అష్టమూర్తితత్త్వమును కలబోసి తల్లిని స్తుతించారు వాగ్దేవతలు. ఇది నిశ్చయముగా మానవాతీతమైన వర్ణన. పరమేశ్వరుని అష్టమూర్తితత్త్వమును కించిత్ భేదములతో వేదములందు, అనేక పురాణములందు చర్చించబడినది. ఇప్పుడు స్వయముగా వాగ్దేవతలద్వారా హవణించబడిన లలితాసహస్రనామ స్తోత్రమునందలి అష్టమూర్తితత్త్వములను అర్ధముచేసుకొనుటకు ప్రయత్నిద్దాము. దీని స్థూలవివరణ తరువాత ఒక్కొక్కనామముయొక్క అర్ధమును తెలుసుకుందాము.
దీనిననుసరించి సత్-చిత్-ఆనంద పరమేశ్వరుని(బ్రహ్మరంధ్రము) దివ్యశరీర సంబంధిత భూమి(మూలాధార), జలము(మణిపూర), అగ్ని(స్వాధిష్ఠాన), వాయువు(అనాహత), ఆకాశము(విశుద్ధి), మనస్సు(ఆజ్ఞ), బుద్ధి(లలాట) మరియు పురుషుడు/అహంకారమను(సహస్రారము) ఎనిమిది తత్త్వములు వరుసగా భవ, శర్వ, ఈశాన, పశుపతి, రుద్ర, అశన, ఉగ్ర మరియు మహాదేవ స్వరూపములు.
మొదటి రెండు అష్టమూర్తితత్త్వసంబంధిత భవ మరియు శర్వ, భూలోకసంబంధిత స్వరూపములు (అథర్వవేదము 6.93.2). అయితే కొన్ని గ్రంథములందు భవుని జలతత్త్వముతోను, శర్వుని భూతత్త్వముతోను జతపర్చగా, మరికొన్నిటియందు వ్యత్యస్తముగా చెప్పబడినవి. లలితాసహస్రనామస్తోత్రమునందు వాగ్దేవతలు భవుని, శర్వుని వరుసగా భూమి జలసంబంధితముగా చెప్పినట్లు తెలియుచున్నది.
శైలపుత్రి భవాయదేవాయనమః
భవో దివో భవ ఈశో పృథివ్యా భవ ఆ పప్ర ఉర్వన్తరిక్షమ్ | తస్మై నమో యతమస్యామ్ దిషీ౩తః ||
(అథర్వవేదము 11.2.27)
పృథ్వి, అంతరిక్షము, వీనిమధ్యగల ఆకాశముతో కలిపి సమస్త దిక్కులను పాలించువాడు భవుడు. ప్రాచ్య, ఆగ్నేయ, దక్షిణ, నైరృతి, ప్రతీచి, వాయవ్య, ఉదీచ్య, ఈశాన్య, ఊర్ధ్వ, అధో దిక్కులను పదిదిక్కులకు రారాజు భవుడు.
మూలాధారస్థితయైన ప్రథమదుర్గ శైలపుత్రియే భవసాగరమును దాటించు భవాని. భవుని పత్నియైన భవాని నవదుర్గా రూపము శైలపుత్రిని, పదినామములతో వర్ణించారు వాగ్దేవతలు.
1. భవానీ, 2. భావనాగమ్యా, 3. భవారణ్యకుఠారికా, 4. భద్రప్రియా 5. భద్రమూర్తిః, 6. భక్తసౌభాగ్యదాయిని, 7. భక్తిప్రియా, 8. భక్తిగమ్యా, 9. భక్తివశ్యా, 10. భయాపహా
బ్రహ్మచారిణి శర్వాయదేవాయనమః
శరమనిన బాణము మరియు జలము. ‘శరు’ (బాణము)నుండి వ్యుత్పాదితమైన శర్వ/శర్వుడనిన విలుకాడు.
ప్రళయే భూతాని శృణాతి హీనస్తీతి శర్వః (అమరకోశము)
ప్రళయమునందు భూతములను హింసించువాడు.
యేతే పాశాః వరుణ సప్తఽసప్త త్రేధా తిష్ఠంతి విఽసితాః రుశన్తః ఛిన్నన్తు సర్వే అనృతమ్ వదన్తమ్ యః సత్యఽవాదీ అతి తమ్ సృజన్తు||
(అథర్వవేదము 4.16.6)
సాక్ష్యేఽనృతమ్ వదన్ పాశౌర్బధ్యతే వారుణైర్భృశమ్
వివశః శతమాజాతీస్తస్మాత్ సాక్ష్యమ్ వదేద్ ఋతమ్ (మనుస్మృతి 8.82)
విశ్వధర్మమును నియంత్రించువాడు (ఋతస్య గోప/ఋతవాన్/ధృతవ్రత) జలాధిపతియగు వరుణుడు.
సూర్యకిరణముల తాపమునకు ఆవిరైన జలము ఆకాశమునుజేరి మేఘములుగా మారి వర్షించి మరల భూమిని జేరుచున్నది. ఈ విధముగా ఘన, ద్రవ, వాయురూపముపొందు నీటిఆకృతి మాత్రమే మారునుగాని అవినాశి (ఋగ్వేదము 1.27.6, 1.32.8).
భూమిని ఆవరించిన దశదిక్కులందు స్థితినిగలిగి, భూలోకసంబంధిత ధర్మప్రతిష్ఠాపకుడైన జలతత్త్వ శర్వుని సూచకముగా స్వాధిష్ఠాన చక్రాధిదేవత బ్రహ్మచారిణిని పదినామములతో వాగ్దేవతలు స్తుతించినట్లున్నది.
స్వాధిష్ఠానాధిదేవతాశక్తి ద్వితీయదుర్గా రూపము బ్రహ్మచారిణి. శంకరప్రియయైన ఈ దేవి భక్తులకు భుక్తిముక్తిప్రదాయిని.
1.శాంభవి, 2.శారదారాధ్యా, 3.శర్వాణీ, 4.శర్మదాయినీ, 5.శాంకరీ, 6.శ్రీకరీ, 7.సాధ్వీ, 8.శరచ్చంద్రనిభాననా, 9.శాతోదరీ, 10.శాంతిమతీ
చంద్రఘంట ఈశానాయదేవాయనమః
తదుత్థేనైవ నాదేన విద్యాదీశానమీశ్వరీ
(శివమహాపురాణము-కైలాససంహిత-5.13)
మాతృకామయమీశానమ్ పఞ్చబ్రహ్మమయన్ తథా
(శివమహాపురాణము-కైలాససంహిత-7.63)
శ్రోత్రస్య వాచః శబ్దస్య విభోర్వ్యోమ్నస్తథైవచ ఈశ్వరీమీశ్వరస్యేమామీశాఖ్యాం హి విదుర్బుధాః
(శివమహాపురాణము-వాయవీయసంహిత ఉత్తరభాగము -3.11)
త్యాగరాజులవారు స్తుతించిన నాభీహృత్కంఠరసనాదులయందు శోభిల్లు సప్తస్వరసుందరులకు మూలమైన నాభీస్థానమునందలి 56 మాతృకావర్ణములకు అనుబంధముగా నాభీచక్రసంబంధిత చంద్రఘంటాదేవి నవదుర్గ స్వరూపమునకు 56 నామములను వాగ్దేవతలు పొందుపరచారు. పంచాషట్ మాతృకావర్ణములు అగ్నిసంబంధితము మరియు అగ్నితత్త్వము రూపతన్మాత్ర సంబంధితము. తల్లిని మాతృకావర్ణరూపిణీయని స్తుతించుటయందలి రహస్యమిదియే.
1.నిరాధారా, 2.నిరంజనా, 3.నిర్లేపా, 4.నిర్మలా, 5.నిత్యా, 6.నిరాకారా, 7.నిరాకులా, 8.నిర్గుణా, 9.నిష్కలా, 10.శాంతా, 11.నిష్కామా, 12.నిరుపప్లవా, 13.నిత్యముక్తా, 14.నిర్వికారా, 15.నిష్ప్రపంచా, 16.నిరాశ్రయా, 17.నిత్యశుద్ధా, 18.నిత్యబుద్ధా, 19.నిరవద్యా, 20.నిరంతరా, 21.నిష్కారణా, 22.నిష్కలంకా, 23.నిరుపాధిః, 24.నిరీశ్వరా, 25.నీరాగా, 26.రాగమథనీ, 27.నిర్మదా, 28.మదనాశినీ, 29.నిశ్చింతా, 30.నిరహంకారా, 31.నిర్మోహా, 32.మోహనాశినీ, 33.నిర్మమా, 34.మమతాహంత్రీ, 35.నిష్పాపా, 36.పాపనాశినీ, 37.నిష్క్రోధా, 38.క్రోధశమనీ, 39.నిర్లోభా, 40.లోభనాశినీ, 41.నిస్సంశయా, 42.సంశయఘ్నీ, 43.నిర్భవా, 44.భవనాశినీ, 45.నిర్వికల్పా, 46.నిరాబాధా, 47.నిర్భేదా, 48.భేదనాశినీ, 49.నిర్నాశా, 50.మృత్యుమథనీ, 51.నిష్క్రియా, 52.నిష్పరిగ్రహా, 53.నిస్తులా, 54.నీలచికురా, 55.నిరపాయా, 56.నిరత్యయా
కూష్మాండ (అనాహతచక్రము) పశుపతయే దేవాయనమః
దుర్గతినాశినియైన కూష్మాండాదేవి అనాహతచక్రస్థ చతుర్ధ దుర్గారూపము.
1.దుర్లభా 2. దుర్గమా 3.దుర్గా 4.దుఃఖహంత్రీ 5.సుఖప్రదా 6.దుష్టదూరా 7.దురాచారశమనీ8.దోషవర్జితా
ఈ ఎనిమిదినామములు వాయుసంబంధిత పశుపతి అష్టమూర్తిరూపసంబంధితముగా చూడవచ్చును. దీనియందలి అంతరార్ధమును చూద్దాము.
మాయాపరిగ్రహవశాద్
బోధో మలినః పుమాన్ పశుర్భవతి।
కాలకలానియతివశాద్
రాగావిద్యావశేన సంబద్ధః।। (పరమార్థసారము-16)
వరిబీజమును కప్పుచూ ధాన్యము, పసుపు-తెలుపు (తవుడు) పొర, వెలుపలి పసుపురంగుఊకపొట్టు ఉన్నట్లే, మాయకులోబడిన శుద్ధచైతన్యము కల, కాల, విద్య, నియత, రాగము పొర/కంచుకములతో కప్పబడుటచే అశుద్ధమై, పశువు/పురుషుడనబడుచున్నది. మలత్రయమనుపాశము ఈ మాయామోహిత పశువులను బంధించుచున్నది.
పాశములవివరణను సాంఖ్యాశాస్త్రముననుసరించి గమనించిన,
చతుర్వింశతి తత్త్వాని మాయాకర్మగుణా అభీ
విషయా ఇతి కథ్యంతే పాశా జీవనిబంధనః
(శివపురాణము- వాయవీయసంహితము-1.)
సాంఖ్యశాస్త్రము(24తత్త్వములు), కశ్మీరశైవసిద్ధాంతముననుసరించి(36తత్త్వములు) చెప్పబడిన జీవులనుబంధించు మాయాతత్త్వసంబంధిత పాశములు, కులార్ణవతంత్రమునందు మనకందరికి సుపరిచితమైన రీతిలో ఎనిమిది విధములుగా విభజించబడినవి.
ఘృణా లజ్జా భయమ్ శోకో జుగుప్సా చేతి పఞ్చమమ్ |
కులమ్ శీలమ్ తథా జాతిరష్టయో పాశాః ప్రకీర్తితాః ||
పాశబద్ధః పశుర్జ్ఞేయః పాశముక్తో మహేశ్వరః |
తస్మాత్ పాశహరో యస్తు స గురుః పరమో మతః ||
(కులార్ణవతంత్రము 13.67,68)
ద్వేషము(ఘృణ), సిగ్గు/బిడియము(లజ్జ), భయము, శోకము, జుగుప్స, కులము, శీలము, జాతి మొదలగు ఎనిమిది పాశబద్ధులు పశువులు.
పశుపతి దేవునికి, మనదేశమునందు ఉత్తరభారతదేశమునందలి రావణపత్ని మండోదరి పుట్టినిల్లుగా చెప్పబడుచున్న మన్ద-సౌర్ (మితమైన సూర్యకిరణముల తీక్ష్ణత గల్గిన స్థలము) గ్రామమునందు మాత్రమే దేవాలయముగలదు. ఇక్కడ పశుపతికి ఎనిమిది ముఖములు. అష్టమూర్తులలో ఒకటైన పశుపతిదేవుని ఈ ఎనిమిది ముఖములు, భవాది అష్టమూర్తులకు గాకుండా అష్టపాశములను ఛేదించు పశుపతి సూచకమని నా అభిప్రాయము.
దేవీసప్తశతి ఎనిమదవ అధ్యాయమునందు చెప్పబడిన ఉదాయుధ, కంబు మొదలగు ఎనిమిది విధముల దైత్యులు ఈ అష్టపాశముల సంకేతములు.
ఇందువలన ఈ ఎనిమిది నామములందు వాగ్దేవతలు, పశుపతిని అనాహతచక్ర/వాయుతత్త్వసంబంధిత అష్టమూర్తిదేవతగా నిగూఢముగా తెలియజేయుచున్నారు.
పాశవిముక్తులను జేయమని ప్రార్ధించు ఋగ్వేదమంత్రము
త్ర్యమ్బకమ్ యజామహే సుగంధిం పుష్టి వర్ధనమ్
ఉర్వారుకబంధనాన్మృత్యోః ముక్షీయ మా ఽ మృతాత్ ||
(ఋగ్వేదము 7.59.12)
త్రినేత్రుడా(త్ర్యంబకుడా)!! అమృతత్వమునుండిగాక, త్రిపురముల బంధములనుండి విమోచనము(ముక్షీయ) గల్గించమని ప్రార్ధిస్తున్నాము.
ఈ మంత్రమునందలి గంధతత్త్వము భూసంబంధిత స్థూలదేహమునకు, పుష్టి తత్త్వము భువర్లోకసంబంధిత సూక్ష్మదేహమునకు సంకేతము. ఉర్వారుకమనగా పొట్లకాయ. పొడుగుగా నాడిలాగఉండే పొట్లకాయ నాభినాడి/బొడ్డుతాడుకు సంకేతము. ఎన్నోరకములైన కాయగూరలు, పండ్లు ఉండగా, మన ఋషులు ఇక్కడ పొట్లకాయ ఎందువలన చెప్పారని చూస్తే పొట్లకాయ అండాశయము, స్త్రీలందలి అండాశయములకు (ovaries) గల రూప/ప్రయోజన సామ్యతవలననిపిస్తున్నది. ఇందువలననేనేమో మన వైద్యశాస్త్రములందు స్త్రీలఅండాశయ సమస్యలకు పొట్లకాయ ఔషధముగా చెప్పబడినది. ఈ విధముగా జననమరణలపరంపర(గర్భధారణ) సూచితమైన ఉర్వారుకబంధనము కారణదేహ సంకేతము.
ఇప్పుడీ మంత్రమునకు అర్ధము చూస్తే, త్రినేత్రుడా!! నిన్ను ప్రార్ధిస్తున్నాము, (సుగంధిం) మంచి ఆరోగ్యవంతమైన స్థూలదేహమును ప్రసాదించి, సత్కర్మాచరణకు ప్రోత్సహించుటద్వారా పుష్టినిపెంచి (పుష్టివర్ధనమ్), అమృతత్వమునుకాకుండా(మా అమృతమ్) జననమరణచక్రములను నశింపజేసి (ఉర్వారుకమివబంధనాన్మృత్యోః), మోచనమును(ముక్షీయ) ప్రసాదించవలసినది.
అనగా త్రిపురములను నశింపజేయవలసినదిగా త్రినేత్రుని ప్రార్ధిస్తున్నాము.
త్రిపురదహనము గావించిన రుద్రునికి పశుపతియని పేరు.
(యజుర్వేదము 6.2.3, శివపురాణము-రుద్రసంహిత – 9.72).
బ్రహ్మాద్యాః స్థావరాంతాశ్చ దేవదేవస్య ధీమతః
పశవః పరికీర్త్యంతే సంసారవశవర్తినః
తేషామ్ పతిత్వాద్భగవాన్ రుద్రః పశుపతిః స్మృతః
(లింగపురాణము ఉత్తరభాగము 9.11-13)
సంసారవర్తులైన ఈ పశువులను పాలించు పరమాత్మను శైవులు పశుపతియనియు, వైష్ణవులు గోపాలుడనియు పూజిస్తున్నారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే!
సహస్రనామస్తోత్రమునందలి దుర్లభా నుండి దోషవర్జితా వరకుగల ఎనిమిదినామములు, అట్టి ఎనిమిది పాశములచే బంధించబడిన పశువులయొక్క కాపరియైన పశుపతి సంబంధితమైనవి.
లోకయాత్రవిధాయినిని ప్రార్ధిస్తూ
శ్రీమాత్రేనమః