Tuesday 16 May 2023

భానుమండలమధ్యస్థ – నామరూపవివర్జితా Bhanumandala madhyastha - Nama rupa vivarjitha

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

 

వికృతిస్సర్వభూతాని ప్రకృతిః పరదేవతా

సతః పాదస్తయోరాద్యా త్రిపదీ గీయతే పరా|| (ఉమా సహస్రము 37.18)

 

భానుమండలమధ్యస్థ – వామకేశి

మంత్రము, తంత్రము, యంత్రము ఈ స్తోత్రమందు ఒక వరుసగా వస్తున్నాయని చెప్పుకున్నాము. భానుమండలస్థుడైన సూర్యభగవానుడు జీవులందు కర్మప్రేరక దేవతామూర్తి. అందుచే భానుమండలమధ్యస్థా నామమునుండి వామకేశి వరకుగల నామములవరకు కర్మానుష్ఠానసంబంధిత తంత్రములను తెలియజేయునవిగా కూర్చారు వాగ్దేవతలు.

 

ఇకపైవచ్చు కొన్ని నామములు కర్మానుష్ఠానసంబంధిత తంత్రసంబంధమని తెలియజేయునది మొదటినామము భానుమండలమధ్యస్థ. సర్వతంత్రస్వరూపిణి అమ్మయని తెలియజేయునామము భానుమండలమధ్యస్థ.

 

భైరవి, భగమాలిని – భైరవీ విద్య (2 నామములు)

 

చైతన్యరహితము (Potential energy), చైతన్యవంతమని (Kinetic energy) శక్తి రెండువిధములు.  మూలాధారమునందు చైతన్యరహితముగా నిద్రించు కుండలినీశక్తియే, జాగృతిచెంది షట్చక్రములద్వారా ప్రయాణించునప్పుడు చైతన్యవంతమైన శక్తియగుచున్నది.

 

అచైతన్యమ్ పరమ్ సూక్ష్మమ్ గుణసామ్యమనుల్బణమ్

యోనిస్వభావసంజ్ఞాతమ్ మత్తో2భూద్భ ఇతి స్వయమ్ ||

 (లక్ష్మీతంత్రము 19.40)

భకారము, చైతన్య రహితమైన పరమసూక్ష్మ అవ్యక్తయోని. 

 

అనంతమైన పరమాత్మశక్తి కేంద్రీకరింపబడి మూలాధారమునందు చైతన్యరహిత కుండలినీశక్తిగా నిద్రించుటచే ఏర్పడు అణవ, మాయీయ, కార్మీక మలావరణముల ప్రభావమువలననే జీవులందు పరిమితత్వము/ద్వంద్వభావన ఏర్పడుచున్నది. ద్వితీయాత్ వై భయం భవతి. భయకారకురాలగుటచే ఈ శక్తి భైరవి. పరావాక్స్థానమగు మూలాధారమునందలి శక్తియగుటచే భైరవీ పరావాక్శక్తికి సంకేతము.

 

సాధకుల తపస్సుద్వారా కుండలినీశక్తిని జాగృతిజెందినప్పుడు వారియందలి భయమును పోగుట్టునది కూడా ఇదే భైరవీశక్తి. అయితే ఈ సందర్భములో షట్చక్రక్రమవాసిని భైరవీశక్తి, సాధకుల సుషుమ్నానాడిద్వారా చక్రములసమాహారమును భేదించుకుంటూ ఊర్ధ్వదిశగా ప్రయాణించు భగమాలినీశక్తి. 

 

పద్మాసనా, భగవతి, పద్మనాభసహోదరి – కమలాత్మిక (3 నామములు)

మూడు నామములు కమలాత్మికావిద్య సంబంధము. కమలము వికసనమునకు సంకేతము.

సహస్రారకమలమునందలి అవ్యక్త మాయాశక్తి కమలాత్మిక. సమతుల్యముగాగల త్రిగుణములతో ఏర్పడిన అవ్యక్తమాయాశక్తి, సృష్టికి మూలపదార్ధము. కుండకు, మట్టి ఉపాదానకారణమెటులనో, అటులనే సృష్టికి కమలాత్మికాశక్తి ఉపాదానకారణమై, క్షేత్ర(space)కారకురాలగుచున్నది. వైదీకపరిభాషననుసరించి పర(తురీయము), పశ్యంతి(సుషుప్తి/ప్రజ్ఞ), మధ్యమ(స్వప్న/తేజస్సు) మరియు వైఖరి(జాగృత్తు/విశ్వము) యని క్షేత్రములు నాలుగువిధములు.

 

వికసనత్వముగల్గిన త్రిగుణములసమతూలిక అవ్యక్త మాయాశక్తి కమలాత్మిక మరియు వ్యక్తీకృత మాయాశక్తి భువనేశ్వరి. 

 

ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః, సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్, ఆబ్రహ్మకీటజననీ, వర్ణాశ్రమవిధాయిని, నిజాజ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్యఫలప్రదా, శృతిసీమంతసింధూరీకృతపాదాబ్జధూళికా, సకలాగమసందోహసుక్తిసంపుటితమౌక్తికా, పురుషార్ధప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ – చతుర్దశ భువనములను పాలించు భువనేశ్వరిదేవి (14 నామములు)

 

తదేక్షత  బహుస్యాం ప్రజాయేయేతి తత్తేజోసృజత  (చాందోగ్యోపనిషత్తు 6.2.3)

ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీనాన్యత్కించన మిషత్ స ఈక్షత లోకాన్ను సృజా ఇతి (ఐతరేయోపనిషత్తు 1.1)

దృష్టి వలన సృష్టి ఏర్పడినది.

భవత్యస్మిన్నితి భువనమ్ – దీనియందు సర్వము గల్గును. (అమరకోశము)  

పరమాత్మయొక్క ఈక్షణాశక్తియే భువనేశ్వరి.

ఆఙ్ ఈషదర్థేభివ్యాప్తౌ సీమార్థే ధాతు యోగజే (అమరకోశము) ననుసరించి ఆకారము సీమార్ధమనగా పరిమితత్వమును సూచించునది. తద్వారా పరిమితత్వమును పొందిన ప్రకాశమే ఆకాశము .

స్థలము(Space) గ్రాహకశక్తి(perception) యొక్క పరిధి సంబంధితము కావున, భువనేశ్వరీశక్తిని జ్ఞానశక్తియని కూడా చెప్పవచ్చును.

ఆకాశ శరీరం బ్రహ్మ (తైత్తిరీయోపనిషత్తు – 6.1)

ఇచ్చటి పదినాలుగు నామములు, గుణానుబంధ చతుర్దశలోకములకు ఈశ్వరియైన భువనేశ్వరివిద్య సంబంధము.  

 

రూప(ప్రకాశ)సంబంధిత శక్తి భువనేశ్వరి, నాదసంబంధిత శక్తి తారాదేవి.

 

అంబికా, అనాదినిధనా, హరిబ్రహ్మేంద్రసేవితా, నారాయణీ, నాదరూపా, నామరూపవివర్జితా
– తారాదేవి
(6 నామములు)

 

అకారః ప్రథమాక్షరో భవత్యుకారో ద్వితీయాక్షరో భవతి మకారస్తృతీయాక్షరో భవతి అర్ధమాత్రశ్చతుర్థాక్షరో భవతి బిందుః పంచమాక్షరో భవతి నాదః షష్ఠాక్షరో భవతి తారకత్వాత్తారకో భవతి| తదేవ తారకం బ్రహ్మత్వమ్ విద్ధి తదేవ ఉపాస్యమితి జ్ఞేయమ్ | గర్భజన్మజరామరణసంసార మహద్భయాత్సన్తారయతీతి తస్మాదుచ్యతే తారకమితి| (శ్రీరామ ఉత్తర తాపినీ ఉపనిషత్తు 2వఖండము 2)

 

అకార, ఉకార, మకార, అర్ధమాత్ర, బిందువు మరియు నాదముతో కూడిన తారకమంత్రమై తరించునట్టి ప్రణవమును తెలియపరచునట్లు, ఈ ఆరునామములు నాదరూపిణియైన తారాదేవి/తారావిద్య సంబంధితముగనున్నవి.

 

శబ్దముకంటే వెలుతురు వేగముగా ప్రయాణించునను విషయము, ముందు మెరుపుతీగ ప్రకాశించినతరువాత పిడుగుశబ్దము వినబడుటద్వారా అందరికీ తెలిసినదే. వాగ్దేవతలు ఈ సత్యమును నాదసంబంధిత తారాదేవికి ముందుగా  భువనేశ్వరివిద్యను కూర్చుటద్వారా తెలియజేసినట్లున్నది.

 

సర్వశక్తిమయి తల్లిని ప్రార్ధిస్తూ

శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment